(ప్రాంతీయ వార్త ప్రతినిధి సెప్టెంబర్ 01)
గాంధారి: స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఎంపీడీవో, ఎమ్మార్వో కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించారు. గత వారం రోజులుగా సీపీఎం బృందం మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలను సేకరించింది. అనంతరం సంబంధిత అధికారులకు వినతిపత్రం అందజేసింది.
చిన్నగుట్ట తండాకు చెందిన కొంతమంది పోడు రైతులకు గ్రామసభ ఆమోదం తెలిపినప్పటికీ ఇప్పటివరకు హక్కు పత్రాలు అందలేదని సీపీఎం నాయకులు తెలిపారు. అర్హులైన పోడు రైతులకు వెంటనే హక్కు పత్రాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అలాగే పోడు పట్టాదారులకు బ్యాంకు రుణాలు మంజూరు చేయడంలో ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. జిల్లాలోని ఇతర ఎస్బీఐ శాఖల్లో రుణాలు అందుతున్నప్పటికీ గాంధారి ఎస్బీఐ శాఖలో మాత్రం పోడు పట్టాదారులను ఇతర ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారని తెలిపారు. పోడు రైతులకు అర్హత మేరకు వెంటనే రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
మాతృసంఘం శివారులోని 119, 175 సర్వే నంబర్ల పరిధిలో సుమారు 700 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని సీపీఎం నాయకులు ఆరోపించారు. ప్రభుత్వ భూమిని సర్వే చేసి, ఆక్రమణల నుంచి స్వాధీనం చేసుకుని అర్హులైన దళితులకు పంపిణీ చేయాలని కోరారు. ఈ సమస్యపై గత మూడు సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ అధికారులు స్పందించడం లేదని విమర్శించారు.
గాంధారి మండల కేంద్రంలో సొంత స్థలం లేని నిరుపేదలకు 120 గజాల స్థలం కేటాయించి, ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే వికలాంగులు, వృద్ధులకు పెన్షన్ మంజూరు చేసేందుకు పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి వెంటనే పెన్షన్లు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రజల సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో ప్రజా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సీపీఎం నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం ఎల్లారెడ్డి ఏరియా కార్యదర్శి మోతి రామ్ నాయక్తో పాటు సార్ఆఫ్ కిషన్రావు, ప్రకాష్, బలరాం, చందర్, డప్పు గణేష్, సురేందర్, గోపాల్, బొజ్జ, వనిత, బుజ్జి తదితరులు, చిన్నగుట్ట తండా పోడు రైతులు పాల్గొన్నారు.
స్థానిక సమస్యల పరిష్కారం కోసం సీపీఎం ధర్నా
RELATED ARTICLES
