(ప్రాంతీయ వార్త ప్రతినిధి ఆగస్టు 29)
గాంధారి: గాంధారి మండలంతో పాటు వివిధ గ్రామాల్లో నెలకొన్న స్థానిక సమస్యల పరిష్కారం కోసం సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో అధ్యయనం చేపట్టినట్లు ఎల్లారెడ్డి ఏరియా కార్యదర్శి మోతి రామ్ నాయక్ తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 31వ తేదీ సోమవారం మండల కార్యాలయాల ఎదుట నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా మోతి రామ్ నాయక్ మాట్లాడుతూ రైతులకు, పోడు రైతులకు బ్యాంకులు రుణాలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. చిన్నగుట్ట తండా, నేరెళ్ల తండాలకు చెందిన గిరిజనులకు పోడు పట్టాలు మంజూరు చేయకుండా జాప్యం చేస్తున్నారని, వెంటనే పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అలాగే మాతృసంఘం పరిధిలోని సర్వే నంబర్లు 119, 175లో సుమారు 700 ఎకరాల భూమి భూస్వాముల ఆధీనంలో ఉందని, ఆ భూమిని పంచాయతీ కోసం గతంలో అనేక పోరాటాలు చేసినప్పటికీ అధికారులు సర్వే పేరుతో ప్రక్రియను నిలిపివేశారని తెలిపారు. ఈ అంశంపై ప్రభుత్వం, అధికారులు స్పష్టమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
గాంధారి పట్టణ కేంద్రంలో ఇళ్ల స్థలాలు లేక పలువురు లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోలేకపోతున్నారని అన్నారు. అర్హులైన లబ్ధిదారులకు 120 గజాల చొప్పున ఇంటి స్థలాలు కేటాయించి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవకాశం కల్పించాలని కోరారు.
విద్యుత్ సౌకర్యం, రోడ్ల సమస్యలు, ఇతర మౌలిక వసతుల సమస్యలపై కూడా ప్రజా పోరాటం కొనసాగిస్తామని నాయకులు తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ధర్నాకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు ప్రకాష్ నాయక్, సర్ఫ్ కిషన్రావు, రాములు, మధు, కిషన్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
స్థానిక సమస్యలపై సీపీఎం పోరాటం.ఈ నెల 31న మండల కార్యాలయాల ఎదుట ధర్నా – మోతి రామ్ నాయక్
RELATED ARTICLES
