ePaper
Tuesday, June 30, 2026
ePaper
Homeఎడిటోరియల్మంజీరాను మింగేస్తున్న ఇసుక మాఫియా..?సర్వేల ముసుగులో సాగుతున్న దోపిడీపై అనుమానాలుకిందిస్థాయి అధికారులే కాదు.. ఉన్నతస్థాయి అండదండలున్నాయా..?...

మంజీరాను మింగేస్తున్న ఇసుక మాఫియా..?
సర్వేల ముసుగులో సాగుతున్న దోపిడీపై అనుమానాలు
కిందిస్థాయి అధికారులే కాదు.. ఉన్నతస్థాయి అండదండలున్నాయా..? ప్రజల్లో పెరుగుతున్న చర్చ

📰 Generate e-Paper Clip


ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 7:
తగ్గేలి మంజీరా సరిహద్దు ప్రాంతంలో జరుగుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భారీ ఇసుక తవ్వకాల వ్యవహారం రోజురోజుకూ మరింత అనుమానాలకు తావిస్తోంది. అర్ధరాత్రి వేళల్లో భారీ జేసీబీలు, డోజర్లు నదీ గర్భంలో పనిచేస్తున్న దృశ్యాలు వెలుగులోకి వస్తున్నప్పటికీ, ఇప్పటి వరకు గట్టి చర్యలు కనిపించకపోవడం ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది.
మీడియాలో వరుస కథనాలు, స్థానికుల ఫిర్యాదులు, ప్రజాప్రతినిధుల వినతులు వచ్చినప్పటికీ పరిస్థితిలో మార్పు కనిపించకపోవడంతో “అసలు ఈ దందా వెనుక ఎవరి అండ ఉంది?” అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రతి సారి “సమగ్ర సర్వే”, “సంయుక్త పరిశీలన”, “నివేదిక సిద్ధమవుతోంది” అనే సమాధానాలు వస్తున్నా, క్షేత్రస్థాయిలో తవ్వకాలు మాత్రం ఆగడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ప్రజల అభిప్రాయం ప్రకారం, సాధారణంగా చిన్న స్థాయి అక్రమ తవ్వకాలపైనే వెంటనే కేసులు నమోదు చేసే అధికారులు, ఇంత భారీ స్థాయిలో జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్న కార్యకలాపాల విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నారో అర్థం కావడం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో కొందరు అధికారులు, ప్రభావశీల వ్యక్తులు, మధ్యవర్తుల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
“కేవలం కింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యమా? లేక మరింత ఉన్నత స్థాయిలో ఎవరి అండదండలైనా ఉన్నాయా?” అనే చర్చ ప్రజల్లో జరుగుతోంది. అయితే ఈ అంశంపై పూర్తి స్థాయి విచారణ జరిగితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ప్రజలు సంధిస్తున్న ప్రశ్నలు
అర్ధరాత్రి తవ్వకాలు జరుగుతున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదు?
మీడియా కథనాల తర్వాత కూడా చర్యలు ఎందుకు కనిపించడం లేదు?
సర్వేల పేరుతో కాలయాపన జరుగుతోందా?
కోట్ల రూపాయల విలువైన సహజ సంపద తరలిపోతుంటే బాధ్యత ఎవరిది?
ఈ వ్యవహారంలో ఉన్నత స్థాయి అధికారుల పాత్రపై వస్తున్న అనుమానాలకు ప్రభుత్వం సమాధానం చెబుతుందా?
అక్రమాలు జరిగాయా లేదా అన్నది విచారణలో తేలాల్సి ఉన్నప్పటికీ, మంజీరా నదీ సంపదపై వస్తున్న ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని, ప్రభుత్వం వెంటనే ప్రత్యేక బృందంతో క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి వాస్తవాలను ప్రజల ముందుంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
“సర్వేలు కాదు… చర్యలు కావాలి”
మంజీరాను కాపాడండి… అక్రమాలు ఉంటే బాధ్యులను కఠినంగా శిక్షించండి అని ప్రజల డిమాండ్.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!