PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 15 July 2026, 3:18 am Posted by : RAVINDHAR

రైతు సంక్షేమమే ధ్యేయంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి నిరంతర కృషి: పోచారం ప్రాజెక్టు పూడికకు నిధుల మంజూరుకు మంత్రికి వినతి పత్రం.

ప్రాంతీయ వార్త ప్రతినిధి రవి జూలై 14

పోచారం ప్రాజెక్టు పూడిక తీతతో* పాటు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని *చెరువులు, కుంటల అభివృద్ధికి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వినతి.
ఎల్లారెడ్డి నియోజకవర్గ రైతుల సంక్షేమం, సాగునీటి వనరుల అభివృద్ధే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి  ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసి నియోజకవర్గానికి సంబంధించిన కీలక సాగునీటి అంశాలపై వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు పోచారం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యంతో పనిచేసేలా పూడిక తీత పనులు చేపట్టాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రారంభంలో *2.5 టీఎంసీల నిల్వ సామర్థ్యం కలిగిన పోచారం ప్రాజెక్టు, సంవత్సరాలుగా పేరుకుపోయిన పూడిక కారణంగా ప్రస్తుతం 1.5 టీఎంసీలకు తగ్గిపోయిందని వివరించారు. దీంతో నాగిరెడ్డిపేట మండలంతో పాటు కింది ఆయకట్టు రైతులు సాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
National Framework of Sediment Managementలో పోచారం ప్రాజెక్టును చేర్చి, కేంద్ర నిధులతో పూడిక తీత పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇప్పటికే కడెం, లోయర్ మానేరు, మిడ్ మానేరు ప్రాజెక్టులు ఈ ఫ్రేమ్‌వర్క్‌లో చోటు దక్కించుకున్న నేపథ్యంలో పోచారం ప్రాజెక్టును కూడా చేర్చాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే గత ఏడాది కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా *ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని 17 చెరువులు, కుంటలు* దెబ్బతిన్నాయని, వాటి పునరుద్ధరణ మరియు *అభివృద్ధి పనుల కోసం రూ.23.60 కోట్ల FDR అంచనాలు సిద్ధంగా* ఉన్నాయని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు.
రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా ఈ పనులకు త్వరితగతిన పరిపాలనా ఆమోదం మంజూరు చేయాలని కోరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ గారు మాట్లాడుతూ, “వ్యవసాయం అభివృద్ధి చెందాలంటే సాగునీటి వనరులు బలోపేతం కావాలి. పోచారం ప్రాజెక్టులో పూడిక తీతతో పాటు నియోజకవర్గంలోని చెరువులు, కుంటల పునరుద్ధరణ పనులు పూర్తయితే రైతులకు దీర్ఘకాలికంగా మేలు జరుగుతుంది. రైతు సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కట్టుబడి పనిచేస్తాను” అని తెలిపారు.
ఎమ్మెల్యే గారి వినతిపై సానుకూలంగా స్పందించిన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈ ప్రతిపాదనలను అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించాలని నీటిపారుదల శాఖ ENC అధికారులను ఆదేశించారు*. అవసరమైన ప్రక్రియలను వేగవంతం చేసి రైతులకు ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారూ