ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 23.
ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంటను ప్రభుత్వం కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమని మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ వాపోయారు.రైతులు పంట కోసి నెలలు గడుస్తున్నా కొనుగోలు ప్రక్రియ వేగవంతం కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో బీబీపేట్ మండలంలోని మల్కాపూర్ గ్రామంలోని వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన పెండింగ్ వరిని ఎలాంటి ఆలస్యం లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
అనంతరం సంబంధిత ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడిన గంప గోవర్ధన్, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణమే వడ్లను తరలించేలా చర్యలు చేపట్టాలని కోరారు. రైతులు పండించిన పంటకు తగిన గౌరవం ఇవ్వాలని, కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతుల సమస్యలను పరిష్కరించకపోతే రైతులందరి తరఫున తానే స్వయంగా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగుతానని గంప గోవర్ధన్ హెచ్చరించారు.