PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 02 June 2026, 1:46 pm Posted by : RAVINDHAR

రైతులను ఆందోళనకు గురిచేయొద్దు – ధాన్యం తరలింపు వేగవంతం చేస్తున్నాం

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 02.

ఎల్లారెడ్డి మండలంలోని రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని కాంగ్రెస్ పార్టీ నాయకులు సూచించారు. ఈరోజు ఎల్లారెడ్డి మండలంలోని శివనగర్ గేట్ సమీపంలోని శబ్దల్పూర్ సెంటర్ వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి, ఐకేపీ సిబ్బంది సహకారంతో ధాన్యాన్ని తరలించేందుకు లారీలను ఏర్పాటు చేసి లోడ్లను పంపించడం జరిగింది.
అదేవిధంగా ఏపీఎం అధికారులతో మాట్లాడి, లారీల కొరత ఉన్న వెలుట్లపేట, సోమార్పేట తదితర కొనుగోలు కేంద్రాలకు కూడా తక్షణమే అదనపు లారీలను పంపించాలని కోరగా, ఆయా కేంద్రాలకు రెండు చొప్పున లారీలను పంపిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.
ఎల్లారెడ్డి మండలంలోని ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యాన్ని త్వరితగతిన తరలించేలా చర్యలు తీసుకోవాలని ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కురుమ సాయిబాబా గారు, పీఎసీఎస్ డైరెక్టర్ గోపీకృష్ణ గారు, ఏఎంసీ చైర్‌పర్సన్ రజిత వెంకట్రాం రెడ్డి గారు, డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ఇతర ప్రజాప్రతినిధులు అధికారులను కోరారు.
రైతులు కష్టపడి పండించిన ధాన్యం సకాలంలో తరలించేందుకు ప్రభుత్వం మరియు అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారు. ప్రస్తుతం పలు కేంద్రాల నుంచి ధాన్యం లారీల ద్వారా మిల్లులకు తరలింపవుతోంది.
ఈ పరిస్థితుల్లో రైతుల సమస్యల పరిష్కారానికి సహకరించాల్సిన ప్రతిపక్షాలు కేవలం రాజకీయ లబ్ధి కోసం అసత్య ప్రచారాలు చేస్తూ రైతులను ఆందోళనకు గురిచేయడం బాధాకరం. విమర్శలు చేయడం కాకుండా రైతులకు ఉపయోగపడే సూచనలు చేయాలని వారు కోరారు.
రైతులందరూ ధైర్యంగా ఉండాలని, మరో రెండు మూడు రోజుల్లో మండలంలోని అన్ని కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం పూర్తిస్థాయిలో తరలింపునకు చర్యలు చేపడుతున్నామని నాయకులు తెలిపారు.