PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 29 June 2026, 7:54 pm Posted by : RAVINDHAR

రూ.40 లక్షల వ్యయంతో రెండు నూతన గ్రామపంచాయతీ భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే మదన్ మోహన్

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 29

ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా *గాంధారి మండలంలోని పొతంగల్ ఖుర్ధ్ & నేరల్ తండా గ్రామంలో రూ.40 లక్షల (పొతంగల్ ఖుర్ధ్: 20 లక్షలు, నేరల్ తండా: 20 లక్షలు)వ్యయంతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాలను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు ఘనంగా ప్రారంభించారు.* గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎల్లారెడ్డి నియోజకవర్గంలో, ముఖ్యంగా గాంధారి మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని అన్నారు.
ప్రతి గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొంటూ…

🔶* ప్రతి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం,
🔶* తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం,
🔶* నూతన గ్రామపంచాయతీ భవనాల నిర్మాణం,
🔶* కొత్త రేషన్ కార్డుల మంజూరు,
🔶* ప్రజలకు నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ,
🔶* ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా వేలాది నిరుపేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడం,
వంటి కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకొచ్చాయని తెలిపారు. ఇప్పటికే అనేక ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తై, గృహప్రవేశాలు కూడా జరుగుతుండడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అన్నారు.
నూతన గ్రామపంచాయతీ భవనం ద్వారా గ్రామ ప్రజలకు పరిపాలనా సేవలు మరింత సులభంగా, వేగంగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. గ్రామాభివృద్ధి పనుల నిర్వహణ, ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలులో ఈ భవనం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పొతంగల్ ఖుర్ద్, నెరల్ తండా గ్రామంలో వివిధ అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయబడుతున్నాయని గ్రామస్థులు తెలిపారు. గ్రామానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనలో ఎమ్మెల్యే గారు చూపుతున్న ప్రత్యేక శ్రద్ధకు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ గారికి పొతంగల్, నెరల్ తండా గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.