ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 06.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో శనివారం ప్రజా పాలన ప్రగతి కార్యక్రమంలో భాగంగా 6వ వార్డులో వార్డు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 6వ వార్డు కౌన్సిలర్ గఫర్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వార్డులో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, డ్రైనేజీల శుభ్రత, వీధి దీపాల నిర్వహణ, వర్షాకాలంలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
అలాగే ప్రతి ఇంటి నుంచి తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా అందించాలని సూచించారు. పరిశుభ్రమైన పరిసరాల నిర్వహణలో ప్రజలు మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కోరారు. వర్షాకాలంలో డ్రైనేజీల్లో చెత్త వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
విద్యుత్ శాఖ అధికారులు మాట్లాడుతూ విద్యుత్ సరఫరాకు సంబంధించిన సమస్యలను వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు శాఖ కృషి చేస్తోందని తెలిపారు.
వార్డు కౌన్సిలర్ గఫర్ మాట్లాడుతూ వార్డు అభివృద్ధి కోసం ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని, ప్రజలు తమ సమస్యలను వార్డు సభల్లో తెలియజేయడం ద్వారా సత్వర పరిష్కారం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
సభలో ప్రజలు తమ సమస్యలు, అవసరాలను అధికారుల దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, 6వ వార్డు కౌన్సిలర్ గఫర్, విద్యుత్ శాఖ అధికారులు, ఎల్లారెడ్డి సొసైటీ వైస్ చైర్మన్ మత్తమాల ప్రశాంత్ గౌడ్, వాసంతి మేడమ్, వార్డు సభ్యులు, మున్సిపల్ సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.