PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 30 May 2026, 9:44 am Posted by : RAVINDHAR

తులసిరాం తండా అభివృద్ధికి పది లక్షలు మంజూరు.

ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 30

రాజంపేట మండలం అరేపల్లి గ్రామ పరిధిలోని తులసిరాం తండాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎం జి ఎన్ ఆర్ ఈ జి ఎస్) ద్వారా మంజూరైన రూ.10 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఘనంగా ప్రారంభించారు. గ్రామ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడం లక్ష్యంగా ఈ అభివృద్ధి పనులను చేపట్టినట్లు నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అరేపల్లి గ్రామ సర్పంచ్ పట్లే రోజాకృష్ణారావు మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, తండాలలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. గ్రామ ప్రజలకు ఇబ్బందులు లేకుండా నాణ్యమైన రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు.
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంకం కృష్ణారావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామ ప్రజలు అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, ఉపసర్పంచ్ అన్వేష్ రావు, వార్డు సభ్యులు చెవుల సంజీవులు, సభవత్ వినోద్, కేతావత్ రమేష్, నేనావత్ లలితమోహన్, చెవుల అర్చన ప్రేమాకుమార్, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.