ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 13
ఖమ్మం జిల్లా తల్లంపాడు గ్రామానికి చెందిన చిన్నారిపై అత్యాచారం చేసి హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు గౌస్ పాషాపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని రాజంపేట రజక సంఘం అధ్యక్షుడు బద్రి స్వామి డిమాండ్ చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వేసవి సెలవులకు బంధువుల వద్దకు వచ్చిన 12 ఏళ్ల చిన్నారిపై ఖమ్మం రాపర్తి నగర్లోని ఓ అపార్ట్మెంట్లో గౌస్ పాషా దారుణానికి పాల్పడ్డాడని ఆరోపించారు. అనంతరం విషయం బయటపడుతుందనే భయంతో చిన్నారిని హత్య చేసేందుకు ప్రయత్నించాడని తెలిపారు. ఈ ఘటన సభ్య సమాజానికి సిగ్గుచేటని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని బద్రి స్వామి కోరారు. నిందితుడికి ఎలాంటి రక్షణ లేకుండా చట్ట ప్రకారం శిక్ష పడేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చిన్నారికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన హెచ్చరించారు.